మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని సజ్జన్పల్లి గ్రామానికి చెందిన సన్వల్లి పవన్ (18) గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అదే విధంగా కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన విఠల్ (22) తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం మొయినాబాద్కు వచ్చి మండల పరిధిలోని కనకమామిడిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నారు. అలాగే వికారాబాద్ జిల్లా నాగసముందర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే విద్యార్థి కుటుంబ సభ్యులు కూడా బతుకుదెరువు కోసం మండలానికి వచ్చారు. ఆంజనేయులు సోమవారం ఇంటర్ పరీక్ష రాసి సజ్జన్పల్లికి వచ్చాడు. అనంతరం సోమవారం సాయంత్రం 4గంటలకు ముగ్గురు కలిసి సరదగా స్నానం చేయడానికి మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఈసీ వాగులో ఉన్న కత్వ వద్దకు వెళ్లారు.
విఠల్, పవన్ ఇద్దరు చేతులు పట్టుకుని నీటిలో దూకారు. వారు దూకిన చోటు నుంచి వాగు ఒడ్డుకు రావడానికి కొంత దూరం ఉంటుంది. అయితే గుంత లోతుగా ఉండటంతో పాటు నీటి ప్రవహం కూడ ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక నీటిలో మునిగి గల్లంతయ్యారు. గట్టు మీద ఉన్న ఆంజనేయులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందివ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొందరు గజ ఈతగాళ్లను నీటిలోకి దింపి వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు.
19 గంటల తరువాత మృతదేహాల వెలికితీత..
ఈసీ వాగులోని నీటిలో మునిగి గల్లంతైన యువకుల మృతదేహాలను 19 గంటల తరువాత బయటకు తీశారు. సోమవారం సాయంత్రం చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపి వేశారు. మంగళవారం ఉదయం పోలీసులు ఎండీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపారు. ఎండీఆర్ఎఫ్ బృందం ప్రతినిధి సతీష్కుమార్ ఆధ్వర్యంలో బోటు సాయంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారుగా 2గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల తరువాత ఒక మృతదేహాం బయటకు తీయగా మరో మృతదేహాన్ని 20నిమిషాల తరువాత బయటకు తీశారు. నీటిలో మునిగిన యువకుల మృతదేహాలను నీటిలో నుంచి తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు.
మృతుల కుటుంబాలను పరమార్శించిన ఎమ్మెల్యే యాదయ్య
ఈసీ వాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలను తెలసుకున్నారు. మృతుల కుటుంబాలను పరమార్శించి, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి మృతుల కుటుంబాలకు రూ. 15వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పోస్టుమార్టం పూర్తియ్యే వరకు స్థానికంగా ఉండి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. అదే విధంగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి యువకుల మృతుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి పవన్ కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం అందించారు.