కన్న తండ్రే కరకు కసాయిలా మారాడు. ఏడేళ్ల కుమార్తెను పీకపిసికి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. స్థానికంగా నివసించే 33 ఏళ్ల వ్యక్తి డ్రగ్స్కు బానిసయ్యాడు. తన వ్యసనం కోసం డబ్బులివ్వాలంటూ భార్యతో గొడవకు దిగాడు.
తన వద్ద డబ్బు లేదని, డ్రగ్స్ కోసం డబ్బు ఇవ్వడం జరగదని ఆ ఇల్లాలు తేల్చిచెప్పింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ భర్త.. ఏడేళ్ల తమ కుమార్తెపై ఆ కోపం చూపించాడు. ఆ అమ్మాయి పీక పిసికి చంపేశాడు. తను చేసిన ఘోరం అర్ధమయ్యే సరికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఏడేళ్ల ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ అమ్మాయి ప్రాణలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. హత్య చేసిన నిందుతుడు కూడా విషం తీసుకున్నాడని, అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.