కొత్తూరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ అబ్దుల్లా తెలిపిన కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం, పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (25) తన చెల్లెలు మమత (24) భర్త అమరేందర్రెడ్డితో పాటు హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో తమ బంధువుల వివాహం ఉండటంతో చంద్రశేఖర్ తన చెల్లెలు బైక్పై గ్రామానికి వెళ్లారు. శుభకార్యాన్ని ముగించుకుని శుక్రవారం గ్రామం నుంచి హైదరాబాద్కు చంద్రశేఖర్, మమత బైక్పై బయల్దేరారు. ఈ నేపథ్యంలో మార్గ మధ్యలో కొత్తూరు మండల కేంద్రంలోని ఐవోసీ పెట్రోల్బంక్ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని చంద్రశేఖర్ ఓవర్ టెక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి లారీటైర్ల కిందపడిపోయింది. దీంతో లారీ చంద్రశేఖర్, మమతపై నుంచి వెళ్లటంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. మమత భర్త అమరేందర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఏఎస్ఐ అబ్దుల్లా తెలిపారు.