స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిన ఒక ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు బాలురు దాడి చేశారు. చిన్నారిని ఆడుకోవడానికి పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది.
స్నేహితులతో ఆడుకుంటానని వెళ్లిన సదరు చిన్నారిపై ఆమె స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆడుకోవడానికి తమ ఇంటికి రావాలని ఆ బాలికను పిలిచిన ఒక 12 ఏళ్ల బాలుడు.. మరో బాలుడితో కలిసి బాలికను బలాత్కరించాడు.
ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని ఏడవడం ప్రారంభించింది. ఏమైందని చూసిన తల్లికి బాలిక మర్మాంగాల నుంచి రక్తం కారడం కనిపించింది. దీంతో వెంటనే కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆడుకోవడానికి పిలిచిన అబ్బాయిలే బాలికపై గ్యాంగ్ రేప్ చేశారని తెలుస్తోంది. సదరు బాలిక జననాంగాల వద్ద తీవ్రమైన గాయాలైనాయని, విపరీతంగా రక్తం కారుతోందని అధికారులు తెలిపారు. ఇది సామూహిక అత్యాచారం కేసని పోలీసులు అంటున్నారు.
ప్రస్తుతం తీవ్రమైన గాయాలతో ఉన్న బాలిక.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో 12 ఏళ్ల బాలుడితోపాటు మరో 11 ఏళ్ల అబ్బాయిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.