బొంరాస్పేట : చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పెద్ద చెరువు వెనుక అటవీ ప్రాంతంలో కానుగ చెట్టుకు ఓ వ్యక్తి ఉరేసుకున్నడని స్థానికులు తాసిల్దార్ షాహెదాబేగంకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి పరిశీలించారు.
మృతుడి వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా హైదరాబాద్ టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఖాజా షఫీవుద్దీన్ (54)గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రెవెన్యూ సిబ్బంది బిందురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రియాంకరెడ్డి తెలిపారు.