ముంబై : రూ 2 లక్షలు లంచం తీసుకుంటున్న ముంబై క్రైం బ్రాంచ్ అధికారిని ఏసీబీ శుక్రవారం అరెస్ట్ చేసింది. నిందితుడిని అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నాగేష్ పురాణిక్ (45)గా గుర్తించాడు. బీఎండబ్ల్యూ కారు చోరీ కేసును విచారిస్తున్న పురాణిక్ ఫిర్యాదుదారుల నుంచి రూ 12 లక్షలు డిమాండ్ చేయగా ఇందులో రూ 4 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ 8 లక్షల మొత్తం చెల్లించాలని లేనిపక్షంలో ఫిర్యాదుదారు భర్త, ఆమె స్నేహితుడిపై చర్యలు చేపడతానని పురాణిక్ హెచ్చరించాడు.
దీంతో ఫిర్యాదుదారు ఏసీబీని సంప్రదించగా నిందితుడిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. పురాణిక్ కోరిన మొత్తం ఇచ్చుకోలేమని ఫిర్యాదుదారు చెప్పగా రూ 4 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆ మొత్తంలో శుక్రవారం రూ 2 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ డబ్బును పురాణిక్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.