న్యూఢిల్లీ: ప్రాణ రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన పెండ్లి అయిన జంటపై కొందరు తుపాకీలతో కాల్పులు జరిపారు. భర్త మరణించగా, తీవ్రంగా గాయపడిన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతం అంబ్రాహి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వీరి పెండ్లిని ఇష్టపడని యువతికి చెందిన బంధువులు ఈ జంటపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. హర్యానాలోని సోనెపట్కు చెందిన 23 ఏండ్ల వినయ్, 19 ఏండ్ల కిరణ్ గత ఏడాది ఆగస్ట్ 13న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, తమ కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు కిరణ్ తల్లిదండ్రులు సోనెపట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు మేజర్ అయిన తమకు ప్రాణ రక్షణ కల్పించాలని ఆ జంట హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. తమ ఇద్దరి గోత్రాలు ఒకటే కావడంతో తమ పెండ్లిని తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని వధువు కిరణ్ ఆరోపించింది. అనంతరం కొత్త జంట ఢిల్లీలో నివాసం ఉంటున్నది. గురువారం రాత్రి వారి ఇంటికి వచ్చిన కొందరు వినయ్, కిరణ్పై కాల్పులు జరిపారు. వినయ్ను కొందరు వెంబడించి కాల్చి చంపారని ఇంటి యజమాని పోలీసులకు చెప్పాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తమపై కాల్పులకు తన తండ్రి, బాబాయ్, ఆయన కుమారుడు కారణమని ఆమె ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.