q
హుజూరాబాద్, ఏప్రిల్ 4: నెలక్రితం వరకు నేల చూపులు చూసిన చికెన్ ధర ప్రస్తుతం ఆకాశన్నంటింది. రెండింతలకు మించి పెరుగడంతో కోడికూర తినాలనుకునే సామాన్యులకు నిరాశే మిగులుతున్నది. వారానికోసారి చికెన్ లేకపోతే ముద్ద దిగనివారు జిహ్వ చాపల్యాన్ని వదిలి కూరగాయలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఉత్తర భారతంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు బర్డ్ఫ్లూ కారణంగా చికెన్ ప్రియులు భయాందోళన చెందారు. దీంతో ఒక్కసారిగా కోడిమాంసం ధరలు పడిపోయాయి. జనవరిలో కిలోకు రూ.100లోపే పలికిన కోడిమాంసం ధర ప్రస్తుతం రూ.260కి చేరింది. స్కిన్తో అయితే రూ.20 తక్కువగా ఉంది. కిలో కోడి ధర రూ.170 పలుకుతున్నది. ఫిబ్రవరి చివరి వరకు కూడా రూ.140 మాత్రమే ఉన్న కిలో చికెన్ ధర అమాంతం పెరుగడంతో మాంసప్రియుల జేబులకు చిల్లులు పడక తప్పడం లేదు.
విక్రయాలపై ప్రభావం
డివిజన్లో సరాసరి రోజుకు 180 క్వింటాళ్ల చికెన్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దాదాపు 3.20 లక్షల జనాభా ఉండగా 100కు పైగా చికెన్ సెంటర్లు ఉన్నాయి. అయితే చికెన్ ధర రోజురోజుకూ పెరుగుతుండడంతో కోళ్ల పెంపకం రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో చికెన్ తినేవారే లేకపోవడంతో ఉచితంగానే కోళ్లను పంచి పెట్టారు. కొన్నిచోట్ల తీసుకువెళ్లేవారు సైతం లేకపోవడంతో బొందలో పూడ్చిపెట్టారు. ఈ దెబ్బ నుంచి క్రమంగా కోలుకుంటున్న సమయంలో బర్డ్ఫ్ల్లూ రక్కసితో మరోసారి కుదేలయ్యారు.
గిరాకీ తగ్గింది
బర్డ్ఫ్ల్లూ భయంతో అప్పుడు చికెన్ కొనేందుకు ప్రజలు అయిష్టత వ్యక్తం చేశారు. ఇప్పుడు ధర పెరుగడంతో కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదివరకు రోజుకు 50 కిలోలు విక్రయించగా ప్రస్తుతం 30కిలోల వరకు మాత్రమే పోతున్నది.
పెండ్యాల తిరుపతి, చికెన్ సెంటర్ యజమాని
ఇవి కూడా చూడండి..