భోపాల్ : కొవిడ్-19 కట్టడికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన కరోనా కర్ఫ్యూను ఉల్లంఘించే వారికి ఓ ఎస్ఐ వినూత్న పనిష్మెంట్ విధిస్తున్నాడు. కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించే వారిచే అరగంట పాటు శ్రీరామ్ అని రాయిస్తున్నాడు. సత్నా జిల్లాలోని కొల్గావన్ పోలీస్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సంతోష్ సింగ్ కరోనా కర్ఫ్యూ ఉల్లంఘనుల చేత అరగంట పాటు రామ్ రామ్ అని రాయిస్తున్నాడు. అయితే తాను దీనిపై ఎవరినీ బలవంతం చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు.
నిబంధనల ప్రకారం కరోనా నియంత్రణలను ఉల్లంఘించేవారిపై జరిమానా విధించడంతో పాటు గంట పాటు నిర్బంధంలో ఉంచుతామని, అయితే తాను అరగంట పాటు వీరిచే రామ్ రామ్ అని రాయిస్తున్నానని సింగ్ పేర్కొన్నాడు. వారి పేర్లను తెలుసుకుని మాత్రమే తాను ఇలా చేస్తుండటంతో ఎవరి మతపరమైన సెంటిమెంట్ దెబ్బతినకుండా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. కరోనా కర్ఫ్యూ సమయంలో అందరూ ఇండ్లకే పరిమితమవడం మేలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.