బంజారాహిల్స్ : కమిషన్ ఇవ్వలేదన్న కక్షతో మామ వరసయ్యే వ్యక్తి పై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన రియల్టర్, నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డిగారి రవీందర్రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. జూబ్లీహిల్స్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నారాయణపేట జిల్లా కోయిల్కొండ మండలం సంగనోని పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రెడ్డిగారి రవీందర్రెడ్డి (44) జూబ్లీహిల్స్ రోడ్ నెం 78లో అంజనీస్ ఒయాసిస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు.
నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండే రవీందర్రెడ్డికి జవహర్నగర్లో నివాసం ఉంటున్న మోహన్రెడ్డి (42) అనే వ్యక్తి వరుసకు అల్లుడు అవుతాడు. మోహన్రెడ్డి కూడా నగరంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. కాగా మోహన్రెడ్డి ద్వారా ఇటీవల రెడ్డిగారి రవీందర్రెడ్డి బేగంపేటలో 600గజాల స్థలం కొనుగోలు చేయగా రూ.6లక్షల కమిషన్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
పలుమార్లు రవీందర్రెడ్డి ఇంటికి వచ్చిన మోహన్రెడ్డి కమిషన్ ఇవ్వాలంటూ అడిగినా పట్టించుకోలేదు. దీంతో బుధవారం ఉదయం 7.30 ప్రాంతంలో రవీందర్రెడ్డి మీద మోహన్రెడ్డి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవీందర్రెడ్డి జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు.
నిందితుడు మోహన్రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా కేవలం కమిషన్ ఇవ్వలేదన్న కక్షతోనే రవీందర్రెడ్డిని చంపాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కదలికలు, సెల్ఫోన్ కాల్డాటాతో పాటు ఇతర అంశాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.