ముంబై : ముంబై పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. పండ్ల బాక్స్ల్లో తరలిస్తున్న 50 కిలోల కొకైన్ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ కొకైన్ విలువ రూ. 502 కోట్ల విలువ చేస్తుందని పేర్కొన్నారు. సముద్రపు కంటైనర్ల ద్వారా ఇటీవల కాలంలో భారీ మొత్తంలో మత్తు పదార్థాలను తరలించడం ఇదే తొలిసారి అని తెలిపారు.
దక్షిణాఫ్రికా నుంచి ముంబై పోర్టుకు కొకైన్ను తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోర్టు వద్ద అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కంటైనర్ను గుర్తించిన అనంతరం దాన్ని తెరిచి చూడగా, పండ్ల బాక్సుల్లో కొకైన్ను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో పాకెట్ ఒక కేజీ బరువు ఉంటుందన్నారు. గ్రీన్ యాపిల్స్ మధ్యలో కొకైన్ను ఉంచినట్లు పేర్కొన్నారు. మొత్తం కొకైన్ విలువ రూ. 502 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. కొకైన్ను తరలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.