లక్నో: కేవలం రూ.250 స్కూల్ ఫీజు కోసం 3వ తరగతి విద్యార్థిని ఒక టీచర్ కొట్టి చంపాడు. ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. సిర్సియాలోని పండిట్ బ్రహ్మదత్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 13 ఏళ్ల బ్రిజేష్ కుమార్ మూడవ తరగతి చదువుతున్నాడు. కాగా, ఆ బాలుడు రెండు నెలల కిందటే ఆ స్కూల్లో చేరాడు. మొదటి నెల స్కూల్ ఫీజు కింద రూ.250 చెల్లించాడు. రెండో నెల స్కూల్ ఫీజు చెల్లించడంలో కాస్త ఆలస్యమైంది. వారి కుటుంబానికి ఆధారమైన పెద్ద అన్నయ్య వేరే ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఆయన డబ్బులు పంపించలేకపోవడంతో ఆ విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదు.
కాగా, ఈ నెల 8న స్కూల్ టీచర్ అనుపమ్ పాఠక్, ఫీజు చెల్లించని విద్యార్థి బ్రిజేష్ కుమార్ను దారుణంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల తర్వాత విద్యార్థి బ్రిజేష్ కుమార్ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టీచర్ అనుపమ్ పాఠక్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన తమ్ముడు రెండు నెలల కిందటే ఆ స్కూల్లో చేరాడని, మొదటి నెల ఫీజుగా రూ.250 కూడా చెల్లించినట్లు మృతుడి అన్న తెలిపాడు. డబ్బులు అందకపోవడంతో రెండో నెల స్కూల్ ఫీజు చెల్లింపులో కాస్త ఆలస్యమైందని, దీనికే తన తమ్ముడ్ని టీచర్ కొట్టి చంపాడని ఆయన ఆరోపించాడు.