అమరావతి : కర్నూలు జిల్లా కౌతాలం మండలం కామవరంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలోఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప, ఈరన్న అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేడకోడవళ్లతో నరికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామంలో మల్లిఖార్జున, శివప్పల మధ్య గత కొంతకాలంగా భూ తగాదాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు భూ విషమై చర్చించుకునేందుకు ఇరువర్గాలు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మల్లిఖార్జునకు చెందిన వ్యక్తులు కారం చల్లి , వేటకోటవళ్లతో శివప్ప, ఈరన్నలపై దాడి చేసి నిప్పంటించారు. శివప్ప సంఘటన స్థలం వద్ద చనిపోగా తీవ్రంగా గాయపడ్డ ఈరన్నను అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఈ సంఘటనలో మరొకరికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు ప్రారంభించారు. దాడి అనంతరం ప్రత్యర్థులు అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.