వరంగల్ : నర్సంపేట పట్టణంలో చైన్స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో నర్సంపేట పట్టణంలోని హనుమాన్ గుడి వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న జయలక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో ఆమె నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చైన్స్నాచింగ్ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. పాకాల రోడ్డులో చైన్స్నాచింగ్కు ఇద్దరు యువకులు యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నర్సంపేట ఎస్ఐ నవీన్ కుమార్ తన బృందంతో వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 25 గ్రాముల బంగారం గొలుసు, రూ. 52 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను రాయప్రోలు చింటు(గీసుకొండ మండలం), దరాంగుల ప్రవీణ్(నర్సంపేట), అలకుంట శ్రీను(నర్సంపేట), బొంత కొమురయ్య(ఐనవోలు మండలం)గా గుర్తించారు. అయితే నిందితులు తమ వద్ద ఉన్న బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో ఉంచి, రూ. 70 వేలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ డబ్బును నలుగురు సమానంగా పంచుకున్నారని పోలీసులు తెలిపారు.