Crime News | సినిమాల్లో ఒక నిజాయితీ పరుడైన అధికారి లేదా పౌరుడి వెంట పడి విలన్ రౌడీలు తరుముతుంటారు. ప్రాణభయంతో వారు పరుగులు తీస్తుంటారు. ఇదంతా చూసిన జనం ఇండ్లలోకి వెళ్లి తాళాలేసుకుంటారు.. సరిగ్గా ఇలాగే సినీ ఫక్కీలో ఒక వ్యక్తిపై నలుగురు దాడి చేసి కత్తిపోట్లకు గురి చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్నది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ వద్ద చాక్ బ్లాక్ బైలైన్ ప్రాంతంలో అకస్మాత్తుగా సమీర్ అహ్మద్ అనే వ్యక్తి వెనుక నలుగురు వ్యక్తులు బిలాల్, సౌద్, ఫిరోజ్, సలీం తరుముతున్నారు. ఇది చూసిన స్థానికులు క్షణాల్లో ఇండ్లలోకి వెళ్లి తలుపులేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యమైంది.
ఆ నలుగురు వ్యక్తులు సమీర్ అహ్మద్ను కత్తితో పొడిచారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు ఆపేందుకు ప్రయత్నిస్తే ఒకరిని చెంపదెబ్బ కొట్టారు. మిగతా వారిని బెదిరించారు. కత్తిపోట్లకు గురైన సమీర్ అహ్మద్ ఒక గ్రాసరీ స్టోర్ ముందు పడిపోయాడు. నిందితుల్లో ఒకరు స్కూటీపై పారిపోతే మిగతా వారు కాళ్లకు బుద్ది చెప్పారు. నిందితులు పారిపోయిన తర్వాత స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అంబులెన్సులో స్థానిక దవాఖానకు.. అటుపై జీటీబీ దవాఖానకు చివరకు రాం మనోహర్ లోహియా దవాఖానకు తరలించారు. దాడి చేసిన నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వారిని పట్టుకోవడానికి గాలిస్తున్నామని తెలిపారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని చెప్పారు.