లక్నో: వైన్ కార్టన్ల మాయం ఘటనలో మహిళా పోలీస్పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ కైరానా పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ముజఫర్నగర్ జిల్లాలో జరిపిన ఎక్సైజ్ శాఖ దాడుల్లో పట్టుకున్న 12 కేసులకు సంబంధించిన మద్యం సీసాల బాక్స్లను కైరానా పోలీస్ స్టేషన్ వేర్హౌస్లో ఉంచారు. మహిళా హెడ్ కానిస్టేబుల్ తారేశ్ శర్మ దీనికి ఇంచార్జీగా ఉన్నారు. కాగా, ఇటీవల ఆమె బదిలీకావడంతో ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించారు. ఈ సందర్భంగా 578 కార్టన్ల వైన్ మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఎస్పీ ఆదేశం మేరకు హెడ్ కానిస్టేబుల్ తారేశ్ శర్మపై సెక్షన్ 409 (ప్రభుత్వ సేవకుడి నమ్మకాన్ని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు శనివారం తెలిపారు.