తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం దూరదర్శన్ కేంద్రం మహిళల వాష్రూంలో హిడెన్ కెమెరా లభ్యమవడం కలకలం రేపింది. వాష్రూంలో దాచిన కెమెరాను ఆదివారం ఓ మహిళ గుర్తించింది. దూరదర్శన్ కేంద్రం అధికారులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల వాష్రూంలో కెమెరా ఇన్స్టాల్ చేసిన సంస్ధ తాత్కాలిక ఉద్యోగిని గుర్తించి విధుల నుంచి తొలగించామని అధికారులు తెలిపారు.
మెయిన్ స్టూడియో సమీపంలోని వాష్రూంలో నిందితుడు కెమెరాను ఏర్పాటు చేశాడు. ఈ వ్యవహారంపై దూరదర్శన్ కేంద్రం ఉన్నతాధికారులతో కూడిన మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీలు అంతర్గతంగా విచారిస్తున్నాయి. మరోవైపు ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.