మేడ్చల్ మల్కాజ్గిరి : అమ్మంటే వారికి ఎనలేని ప్రేమ.. అమ్మే జీవితంగా, అమ్మే లోకంగా బతుకుతున్నారు. అమ్మను విడిచి ఒకరోజు కూడా ఉండలేరు. ప్రేమనురాగాలు కురిపిస్తూ.. కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కానీ తొమ్మిది నెలల క్రితమే అమ్మ వారిని విడిచి అనంతలోకాలకు వెళ్లింది. అమ్మ ప్రేమ కరువైందని, అమ్మ లేని జీవితం ఎందుకని.. ఆమె కుమారులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కీసర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన ప్రమీలకు ఇద్దరు కుమారులు.. యాదిరెడ్డి(34), మహిపాల్ రెడ్డి(29). అయితే గత కొంతకాలంగా ప్రమీల అనారోగ్యంతో బాధపడుతూ 9 నెలల క్రితం చనిపోయింది. అప్పట్నుంచి అన్నదమ్ముళ్లు ఇద్దరూ తీవ్ర మనో వేదనకు గురవుతూనే ఉన్నారు. అమ్మ ప్రేమ లేకపోవడంతో.. ఎంతో కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి మృతిని తట్టుకోలేని ఆ కుమారులిద్దరూ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. యాదిరెడ్డి ఉరేసుకోగా, మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, అమ్మ లేనందునే ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.