AP News | అమరావతి : పెళ్లైంది.. ఇక తన భర్తతో సంసార జీవితం గడపాలనుకుంది. కానీ కాళ్లపారాణి ఆరకముందే ఆ నవ వధువు మృతి చెందింది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామానికి చెందిన నవ వధువు అఖిల(20)కు శుక్రవారం రాత్రి 10 గంటలకు వివాహమైంది. ఇక కుటుంబ సభ్యులందరూ అందరూ వెళ్లిపోయారు. పెళ్లి ప్రక్రియ ముగిసిన తర్వాత నీరసంగా ఉందని చెప్పి అఖిల నిద్రలోకి జారుకుంది. కాసేపటికి ఆమెను బంధువులు పిలిచారు. కానీ స్పందించలేదు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ్నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అఖిలను పరీక్షించిన వైద్యులు అప్పటికే నవ వధువు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో వరుడితో పాటు ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నవ వధువు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.