చెన్నై : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాలికి ఎలాంటి హానీ కలగొద్దనే ఉద్దేశంతో.. ప్రియుడు ఆమె ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని రామంతపురం జిల్లాలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. విజయ్, అపర్ణ ఇద్దరూ శివగంగ జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో తమ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. వారి కోర్సు పూర్తయ్యేలోపు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం విజయ్.. చెన్నై వెళ్లాడు. అపర్ణ తన సొంతూరుకు వెళ్లింది.
ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం అపర్ణ ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె ఫోన్ను లాగేసుకున్నారు. విజయ్ను మరిచిపోవాలని హెచ్చరించారు. ఈ విషయం తన ఫ్రెండ్స్ ద్వారా విజయ్కు తెలియడంతో.. అతను ఇటీవలే తన బంధువులతో కలిసి అపర్ణ ఇంటికొచ్చాడు. అపర్ణను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. మళ్లీ శనివారం ఉదయం అపర్ణ నివాసానికి విజయ్ చేరుకుని పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. తమ బిడ్డ అపర్ణను చంపుకుంటే ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అవుతుందని ఆమె తల్లిదండ్రులు హెచ్చరించారు.
తన ప్రియురాలిని చంపొద్దు.. తానే చనిపోతాను అంటూ.. వెంట తెచ్చుకున్న పెట్రోల్ను పోసుకుని నిప్పంటించుకున్నాడు విజయ్. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలపాలైన విజయ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.