బండ్లగూడ : సరదాగా ఈత కోసం వచ్చిన నలుగురులో ఒక బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీస్ సేష్టన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ పరిధిలో నివాసం ఉండే విశ్లవత్ గణేష్ కుమారుడు విశ్లవత్ చరణ్ (9) మంగళవారం మధ్యాహ్నం ఈసీ నదిలో ఈత కోసం తన సోదరుడుతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చాడు.
ముందుగా చరణ్ నీటిలో దిగగా అతడు మునగడం గమనించిన తోటివారు అతన్ని బయటకు లాగేందుకు ప్రయత్నం చేశారు. ఆ చిన్నారుల ప్రయత్నం విపలం కావడంతో చరణ్ నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాత్రయిన చరణ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి పరిసరాలను గాలిస్తుండగా వారి చిన్న కుమారుడు అసలు విషయం తెలిపాడు.దీంతో వారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం పోలీసులు స్థానికులతో కలిసి ఈసీ నదిలో గాలింపు చేపట్టారు.
కొద్ది సేపటి తర్వాత చరణ్ మృత దేహం లభించింది. పోలీసులు బాడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.