ముంబై: మాజీ ప్రియుడి న్యూడ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో మహిళ పోస్ట్ చేసింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే కింది కోర్టుతోపాటు హైకోర్టు కూడా ఆ మహిళ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. వివాహితుడైన ఒక వ్యక్తి, ఒక మహిళ మధ్య 2010 నుంచి సంబంధం ఉంది. అయితే వారిద్దరి మధ్య గొడవలు రావడంతో 2020లో బ్రేకప్ అయ్యారు.
కాగా, ఆ మహిళ అనంతరం నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచింది. ఆ వ్యక్తికి సంబంధించిన అసభ్య ఫొటోలను అందులో పోస్ట్ చేసింది. దీనిని అతడి కుమార్తె చదువుతున్న స్కూల్కు ట్యాగ్ చేసింది. అంతేగాక ఆ వ్యక్తి న్యూడ్ ఫొటోలను అతడి భార్య ఈమెయిల్కు పంపింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆ మహిళ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ను ట్రయిల్ కోర్టు తిరస్కరించగా బాంబే హైకోర్టుకు వెళ్లింది. కాగా, బాధితుడితోపాటు అతడి కుమార్తె కూడా తీవ్ర అవమానం పాలయ్యారని, వారి వ్యక్తిగత జీవితం నాశనమైందని ఆ వ్యక్తి తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. పోలీస్ దర్యాప్తునకు ఆ మహిళ సహకరించడం లేదని, కంప్యూటర్, మొబైల్ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీంతో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఆమె అరెస్ట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను పాటించాలని పేర్కొంది.