మంత్ర తంత్రాలపై మూఢనమ్మకంతో 18 నెలల పసికందు పీక పిసికి చంపేసిందో మహిళ. ఈ ఘటన యూపీలోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. సరోజ్ దేవి (32) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమేష్ కుమార్ అనే వ్యక్తికి 18 నెలల పసికందు ఉన్నాడు. ఇటీవల బిడ్డను నాయనమ్మ దగ్గర వదిలి తను బయటకు వెళ్లాడతను.
తిరిగి వచ్చే సరికి బాబు కనిపించలేదు. ఎంత వెతికినా పసివాడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలో ఊరి అవతల ఉన్న చెరకు తోటలో పసికందు శరీర భాగాలు కనిపించాయని గ్రామస్థులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పసికందు తల కూడా మరోచోట కనిపించింది.
అది చూసిన రమేష్.. తన అన్న, వదినపై అనుమానం వ్యక్తం చేశాడు. తన వదిన ఇప్పటికి మూడు సార్లు గర్భం దాల్చినప్పటికీ, ఆ బిడ్డలు పుట్టిన కొంత సేపటికే చనిపోయారని, ప్రస్తుతం ఆమె గర్భంతో ఉందని, పుట్టే బిడ్డ బతకాలని కోరుతూ ఒక తాంత్రికుడిని కలిసిందని రమేష్ చెప్పాడు.
ఆ తాంత్రికుడి సూచనల ప్రకారమే తన బిడ్డను కిరాతకంగా చంపేశారని ఆరోపించాడు. దర్యాప్తులో అది నిజమేనని తేలింది. సరోజ్ తను చేసిన ఘోరాన్ని అంగీకరించింది. తన బిడ్డ బతకడం కోసం తాంత్రికుడు ఆదేశాల మేరకు పసివాడి గొంతు పిసికి చంపేశానని, అనంతరం బిడ్డ శరీరభాగాలను వేరు చేసి ఊరవతల పారేశానని చెప్పింది.