పాట్నా: భార్య హత్య కేసులో భర్త జైల్లో ఉన్నాడు. మరోవైపు మరణించిన ఆ భార్య ఎంచక్కా ప్రియుడితో సహజీవనం చేస్తున్నది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన బీహార్లోని మోతీహరి జిల్లాలో జరిగింది. లక్ష్మీపూర్కు చెందిన శాంతి దేవికి 2016 జూన్ 14న దినేష్ రామ్తో పెళ్లి జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తమ కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో శాంతి తండ్రి యోగేంద్ర యాదవ్, భర్త దినేష్ రామ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది బైక్తో పాటు రూ.50,000 అదనపు కట్నం డిమాండ్ చేశాడని, ఈ నేపథ్యంలో తమ కుమార్తెను అతడు హత్య చేసి ఉంటాడని ఆరోపించాడు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దినేష్ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
మరోవైపు భర్త ఇంటి నుంచి పారిపోయిన భార్య శాంతి దేవి పంజాబ్లోని జలంధర్లో ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నది. కాగా, ఆమె హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారికి ఎక్కడో ఏదో తేడా ఉన్నట్లు అనిపించింది. దీంతో శాంతి దేవి మొబైల్ ఫోన్ను సాంకేతికంగా ట్రేస్ చేశారు. హత్యకు గురైనట్లుగా కేసు నమోదైన ఆమె జలంధర్లో తన ప్రియుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక పోలీస్ బృందాన్ని అక్కడకు పంపి శాంతి దేవిని మోతీహరికి తీసుకొచ్చారు.