Bihar | పాట్నా : ఓ స్కూల్ ప్రిన్సిపల్ ఓ విద్యార్థి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. నిద్రిస్తున్న విద్యార్థిపై దాడి చేశాడు. అతని ఛాతీపై కాలు పెట్టి తొక్కాడు. ఈ ఘటన బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంగేర్ జిల్లాలోని ఫరియాద్పూర్ ఏరియాలో నిర్మలా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ను రామ్నాథ్ మండల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ స్కూల్కు ప్రిన్సిపల్ కూడా రామ్నాథ్ మండలే. అయితే మాథ్యూ రాజన్(12) అనే విద్యార్థి చేతిలో ఉన్న డెటల్ బాటిల్ అనుకోకుండా మరో విద్యార్థి ముఖంపై పడింది.
దీంతో రామ్నాథ్ భార్య నిర్మలా దేవి రాజన్పై చేయి చేసుకున్నారు. అదే రోజు రాత్రి పిల్లలు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన రామ్నాథ్.. రాత్రి 10 గంటల సమయంలో రాజన్ను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా విద్యార్థి ఛాతీపై కాలు పెట్టి తొక్కి హింసించాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
తనకు జరిగిన అవమానంపై రాజన్ తన తల్లిదండ్రులకు తెలిపాడు. వారు హుటాహుటిన స్కూల్ వద్దకు చేరుకోగా, రాజన్ను కలిపించేందుకు నిరాకరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అప్పుడు అనుమతించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం రామ్నాథ్తో పాటు ఆయన భార్య నిర్మలాదేవీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్ తండ్రి డిమాండ్ చేశాడు.