పాట్నా : ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టాడు ఆ వైద్యుడు. ఈ దారుణ ఘటన బీహార్లోని హాజీపూర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బాలిగాన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ మహిళ గర్భిణి. అయితే ఆమెకు ఇటీవలే తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న డాక్టర్ను సంప్రదించింది. అతను ఇచ్చిన మెడిసిన్స్ వాడిన తర్వాత బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో గర్భిణికి డాక్టర్ అబార్షన్ చేశాడు. పిండాన్ని తీసి బకెట్లో ఉంచాడు. ఇక బాధితురాలి పరిస్థితి విషమించడంతో పాట్నాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
అయితే పిండాన్ని తమకు ఇవ్వాలని, బాధితురాలి కుటుంబ సభ్యులు అడగ్గా వైద్యుడు నిరాకరించాడు. ఈ ఆధారం దొరికితే పోలీసులు మీపై, మాపై కేసులు నమోదు చేస్తారని డాక్టర్లు చెప్పినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే పిండాన్ని బకెట్లో ఉంచి, పెంపుడు కుక్కకు డాక్టర్ ఆహారంగా ఇచ్చినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టినట్లు ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలలేదని పోలీసులు తెలిపారు. మహిళ మృతికి కారణమైన వైద్యుడు, అతని భార్య పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.