పాట్నా : పబ్లిక్ పరీక్షలు రాసినప్పుడు.. పాస్ కావాలనే లక్ష్యంతో చదువుతారు. అయినప్పటికీ తాము చదివిన ప్రశ్నలు రాకపోతే ఆందోళనకు గురవుతాం. అలాంటి సందర్భాల్లో చిటీలు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటాం. దాంట్లో భాగంగానే ఓ బాలుడు.. పరీక్ష రాస్తున్న తన సోదరికి ఓ చిటీని కిటికీలో నుంచి విసిరేశాడు. దురదృష్టవశాత్తు ఆ చిటీ మరో అమ్మాయిపై పడింది. దాన్ని లవ్ లెటర్గా భావించిన ఆ బాలిక.. ఇంటికెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇక ఆ అబ్బాయి ఇంటికెళ్లి, అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఈ దారుణ ఘటన బీహార్లోని భోజ్పూర్లో గత వారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్లో స్కూల్ విద్యార్థులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆరో తరగతి చదువుతున్న తన సోదరికి చిటీలు వేసేందుకు బాలుడు ఎగ్జామ్ సెంటర్ వద్దకు వెళ్లాడు. కిటికీలో నుంచి దొంగచాటుగా లోపలికి చిటీలు విసిరాడు. కానీ ఆ చిటీ తన సోదరి వద్ద పడలేదు. పక్కనే ఉన్న మరో అమ్మాయికి దగ్గర్లో పడింది. భయంతో ఆ చిటీని ఆమె తీసుకోలేదు. లవ్ లెటర్గా భావించింది. ఇక ఇంటికి వచ్చిన బాలిక.. తనకు ఓ అబ్బాయి లవ్ లెటర్ విసిరాడని చెప్పింది.
దీంతో ఆగ్రహాంతో ఊగిపోయిన బాలిక పేరెంట్స్, సోదరులు కలిసి ఆ అబ్బాయి ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేకపోయేసరికి, బయట గాలించగా దొరికాడు. కిడ్నాప్ చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. స్థానిక ఆలయం వద్ద చేతులను పడేశారు. మిగతా భాగాలను మహాత్ బనియా రైల్వే ట్రాక్ వద్ద పడేశారు. అయితే టెంపుల్ వద్ద ఉన్న చేతిని స్థానికుల కంట పడింది. తక్షణమే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శరీర భాగాలను, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్ బాడీ తమ బిడ్డదే అని బాధిత కుటుంబం నిర్ధారించింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని హత్య చేసిన వారంతా మైనర్లు అని పోలీసులు తెలిపారు. వీరిని జువైనల్ హోమ్కు తరలించినట్లు పేర్కొన్నారు. అయితే హత్యకు గురైన బాలుడు తెలివమంతుడని, చదువుల్లో ముందుండే వాడని తల్లిదండ్రులు తెలిపారు.