పాట్నా: ఒక బీజేపీ నేత తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్లోని ముంగేర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా ముంగేర్ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ అలియాస్ బడా బాబు గురువారం రాత్రి 7.45 గంటలకు పొలం నుంచి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్య ప్రీతి కుమారితో ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన అరుణ్ యాదవ్, తన వద్ద ఉన్న తుపాకీతో భార్య తలపై దగ్గర నుంచి కాల్చాడు. దీంతో రక్తం మడుగుల్లో పడి ఆమె మరణించింది. అనంతరం అరుణ్ యాదవ్ తన బెడ్ రూమ్లోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, లాల్ దర్వాజా ప్రాంతంలోని స్థానికులు ఈ కాల్పుల శబ్దానికి భయాందోళన చెందారు. కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అరుణ్ యాదవ్ ఇంటికి వచ్చి పరిశీలించారు. బెడ్ రూమ్ నుంచి రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, అరుణ్ యాదవ్ భార్య ప్రీతి కుమారి, మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ప్రచారం చేయాలని భార్యకు అరుణ్ యాదవ్ చెప్పాడు. అయితే కొంత విశ్రాంతి తర్వాత చేస్తానని ఆమె చెబుతుండటంతో ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత మూడు రోజులుగా గొడవ జరుగుతున్నదని అరుణ్ తండ్రి ఫులేశ్వర్ యాదవ్ పోలీసులకు వెల్లడించాడు.