న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ స్కామ్లతో రెచ్చిపోవడంతో రోజుకో తరహా మోసం (Cyber Fraud) వెలుగులోకి వస్తోంది. నేరగాళ్లు అమాయకులకు ఆన్లైన్ వేదికగా టోకరా వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. యూట్యూబ్ స్కామ్, ఓటీపీ స్కామ్, పార్ట్టైం జాబ్ స్కామ్ వంటి పలు స్కామ్లతో దోచేస్తున్న నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటూ దండుకుంటున్నారు. ఇక వాట్సాప్ స్కామ్లకూ సైబర్ నేరగాళ్లు తెరలేపారు. +92 కంట్రీ కోడ్తో వచ్చే వాట్సాప్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్చువల్ నెంబర్లను ఉపయోగిస్తున్న స్కామర్లు బాధితులను నిండా ముంచేందుకు కొత్త ట్రిక్కులతో మభ్యపెడుతున్నారు. +92 కోడ్తో ఆరంభమయ్యే నెంబర్లతో బాధితులను సంప్రదిస్తున్న మోసగాళలు ఉచితంగా ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రోడక్ట్స్ అందిస్తామని నమ్మబలుకుతూ ముగ్గులోకి దించి ఆపై రూ. లక్షలు దండుకుని కనుమరుగవుతున్నారు. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తిని ఇటీవల ఇన్స్టాగ్రాంలో సంప్రదించిన దుండగులు దుబాయ్ నుంచి ఐఫోన్ 14ను ఉచితంగా డెలివరీ చేస్తామని మభ్యపెట్టి రూ. 7 లక్షలు కాజేశారు. ఐఫోన్ 14ను సూరత్ ఎయిర్పోర్ట్కు పంపామని టోకెన్ ఫీజు, ఇతర ఫీజుల కింద రూ. 10,000 చెల్లించాలని కోరగా బాధితుడు యూపీఐ పేమెంట్ ద్వారా చెల్లించాడు.
ఎంతకీ ఐఫోన్ రాకపోవడంతో అనుమానం రాగా, ఆపై తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 6.76 లక్షలు అకారణంగా డెబిట్ అయ్యాయని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. స్కామర్ నెంబర్కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ అని వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఉచిత ఐఫోన్కు ఆశపడి స్కామర్లకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వడంతో బాధితుడు మోసపోయాడు. +92 కోడ్ పాకిస్తాన్ కాగా, భారత పౌరులను టార్గట్ చేసేందుకు స్కామర్లు వాట్సాప్ను ఉపయోగిస్తున్నట్టు సైబర్ పోలీసులు గుర్తించారు. కాలర్స్ మాత్రం పాకిస్తాన్కు చెందిన వారు కాదని, పైన ప్రస్తావించిన కేసులో స్కామర్లు బాధితుడిని సంప్రదించేందుకు వర్చువల్ నెంబర్ను ఉపయోగించి మోసానికి తెరలేపారని పోలీసులు తెలిపారు.
Read More :
Meghalaya | మేఘాలయా సీఎం సంగ్మా కార్యాలయంపై రాళ్ల దాడి.. గాయపడిన భద్రతా సిబ్బంది