బెంగళూరు : ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన రెండేండ్ల పసిబిడ్డను చంపి, తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టేందుకు తన వద్ద డబ్బు లేదని, అందుకే బిడ్డను చంపానని తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ తాలుకా పరిధిలోని కెందట్టి గ్రామ సమీపంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్కు చెందిన రాహుల్ పర్మార్(45) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. రెండేండ్ల క్రితం తన భార్య భవ్య, కూతురి(2)తో కలిసి బెంగళూరు నగరానికి వచ్చాడు. ఇక బెంగళూరులోనే ఉంటూ ఓ వైపు జాబ్ చేస్తూనే, మరో వైపు బిట్ కాయిన్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. గత 6 నెలల నుంచి ఉద్యోగం కూడా లేదు. దీంతో పూట గడవడమే కష్టంగా మారింది.
అయితే నవంబర్ 15వ తేదీన బిడ్డను తీసుకొని రాహుల్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఇంటికి తిరిగి రాకపోవడంతో తన భర్త, కూతురు అదృశ్యమైనట్లు భవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కెందట్టి గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద పసిబిడ్డ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అక్కడే బ్లూ కలర్ రంగులో ఉన్న కారు కూడా ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం తానే పాపను చంపినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు. తన వద్ద తినడానికి తిండి కూడా లేదని, డబ్బు లేకపోడంతో బతకడం కష్టంగా మారిందని రాహుల్ చెప్పాడు. చేసేదేమీ లేక తన బిడ్డను బయటకు తీసుకెళ్లి, ఆమెను కాసేపు గుండెలకు హత్తుకుని, ఆడుకుని చంపేశానని పేర్కొన్నాడు.
అయితే కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో బంగారం మాయమైందని రాహుల్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. బంగారాన్ని తానే దొంగిలించి, విక్రయించగా వచ్చిన నగదును అవసరాలకు ఉపయోగించినట్లు విచారణలో తేలింది. దీంతో అతనిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. అయితే తనపై కేసు నమోదైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.