బెంగళూరు : తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు అదృశ్యమయ్యాడని నాటకామాడాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బట్టబయలైంది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరులోని గురప్పనపాల్యకు చెందిన సునీల్ కుమార్ (30) కు స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహమైంది. ఈ దంపతులకు 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సునీల్ కుమార్ ప్రయివేటు ఉద్యోగి కాగా, ఆయన భార్య ఓ గార్మెంట్ షాపులో పని చేస్తోంది. ఆవిడతో పాటు పని చేసే మరో మహిళతో సునీల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెను వదిలిపెట్టాలని పలుమార్లు సునీల్కు తన భార్య చెప్పింది. అయినప్పటికీ వినిపించుకోలేదు. అయితే ఆగస్టు చివరి వారంలో ప్రియురాలితో సరసాలాడుతున్న తండ్రిని పట్టుకుని కుమారుడు నిలదీశాడు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించాడు. భార్య కూడా వారి సంబంధాన్ని తిరస్కరిస్తోంది. ఇప్పుడు కుమారుడు కూడా నిలదీయడంతో.. కోపగించుకున్న తండ్రి అతన్ని చంపేశాడు. భార్య ఇంటికొచ్చేసరికి కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆమె బోరున విలపించింది.
రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తల్లి బోరున విలపించింది. ఈ క్రమంలో భర్త ఆమె వద్దకు వచ్చి ప్రియురాలిని వదిలేస్తాను. బాలుడి మృతదేహాన్ని ఖననం చేసేందుకు సహకరించాలని భార్యను కోరాడు. దీంతో ప్రియురాలితో పాటు భార్యాభర్తలిద్దరూ కలిసి కుమారుడి డెడ్ బాడీని తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.
పిల్లాడు కనిపించడం లేదు.. ఎక్కడికి వెళ్లాడు.. ఏమైంది? అని ఆ భార్యాభర్తలను కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నించారు. వారికి ఏం చెప్పాలో తెలియడం లేదు. దీంతో ఆగస్టు 26న పోలీసు స్టేషన్కు వెళ్లి తన కుమారుడు ఈ ఏడాది ఫిబ్రవరి 7న అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు సునీల్ కుమార్. ఆరు నెలల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశారు. బిడ్డ అదృశ్యమైతే మరుసటి రోజే ఫిర్యాదు చేయాలి. ఎందుకు ఆలస్యమైంది? అనే కోణంలో పోలీసులు విచారించారు. విచారణలో సునీల్ వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో మొత్తానికి కుమారుడిని తానే చంపానని, ఖననం చేసేందుకు తన భార్య, ప్రియురాలి సహకారం తీసుకున్నానని సునీల్ అంగీకరించాడు.