బెంగళూరు: చికెన్ ఫ్రై వండలేదని, భార్యను భర్త హత్య చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 28 ఏండ్ల షిరిన్ బాను ఆగస్ట్ 18 రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. కాగా, వ్యాపారం చేసే భర్త ముబారక్ పాషా భార్య కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. గమనించిన పోలీసులు ఆయనపై నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలో పాషా సోమవారం తన న్యాయవాదితో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చాడు. భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆగస్ట్ 18న చికెన్ ఫ్రై వండమని భార్యకు చెప్పానన్నాడు. ఇంటికి వచ్చి చూడగా భార్య ఆ కూర వండలేదని, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని తెలిపాడు. దీంతో కోపంతో చెక్కతో భార్య తలపై కొట్టగా ఆమె చనిపోయిందని వివరించాడు. పిల్లలు పడుకొని ఉండగా భార్య మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి అర్థరాత్రి వేళ బైక్పై తీసుకెళ్లి చిక్కబనవర సరస్సులో పడేసినట్లు వెల్లడించాడు.
దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సరస్సు నుంచి భార్య మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు.