కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి నగదును తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి ఓఎల్ఎక్స్లో రూ.12 వేలకు ఐ ఫోన్ అమ్మబడునని ప్రకటన ఇచ్చాడు.
అదిచూసిన కాచిగూడ డివిజన్లోని గణేశ్ డ్రైవింగ్ స్కూల్ ప్రాంతానికి చెందిన అంజనేయులు కుమారుడు ఎస్.రవికిరణ్ (17) గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని చెప్పాడు. ఐతే ముందు రూ.5 వేలు పంపాలని మాయ మాటలు చెప్పాడు.
ఆతని మాటలను నమ్మిన రవికిరణ్ ఓటీపీని క్లిక్ చేయడంతో వెంటనే ఆయన అకౌంట్లోంచి రూ.51 వేలు మాయ మయ్యాయి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన రవికిరణ్ సోమవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.