పాట్నా: కస్టడీలో ఉన్న వ్యక్తిని తేనెటీగలు కుట్టడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీస్ టార్చర్ వల్లే అతడు చనిపోయాడని ఆరోపించిన స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. పోలీస్ స్టేషన్పై రాళ్లతో దాడి చేసి నిప్పు పెట్టడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ హింసలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించగా పలువురు గాయపడ్డారు. బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియాలో ఈ ఘటన జరిగింది. డీజే గ్రూప్లో పని చేసే అనిరుధ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అయితే అతడు పోలీస్ స్టేషన్లో చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తమ వ్యక్తిని పోలీసులు కొట్టి చంపారని ఆరోపించారు.
ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బల్తార్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆగ్రహావేశాలకు లోనైన కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. మూడు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ హింసా కాండలో రామ్ జతన్ సింగ్ అనే పోలీస్ కానిస్టేబుల్ చనిపోయినట్లు ఎస్పీ ఉపేంద్ర నాథ్ వర్మ తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనిరుద్ధ్ యాదవ్ను తేనెటీగలు కుట్టాయని అన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడని ఆయన వెల్లడించారు.