బెంగళూరు: అపార్ట్మెంట్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి పడి పసి బాలుడు మరణించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ విషాద ఘటన జరిగింది. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఆన్లైన్ డెలివరీ సంస్థలో, ఆయన భార్య సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేస్తున్నారు. దీంతో వారు పనికి వెళ్లేటప్పుడు 22 నెలల కుమారుడు దివ్యాన్షి జస్విక్ రెడ్డిని, అమ్మమ్మ శోభా వద్ద ఉంచేవారు. ఈ నేపథ్యంలో తమ పని ప్రదేశం సమీపంలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు లేదా అద్దెకు తీసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల 15న రవీంద్ర, ఆయన అత్త కలిసి ఎలక్ట్రానిక్స్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను చూసేందుకు బాలుడ్ని తీసుకొని వెళ్లారు. ఐదో అంతస్తులో ఖాళీగా ఉన్న ఒక ఇంటిని వారు పరిశీలిస్తున్నారు. ఇంతలో ఆ ఫ్లాట్ బాల్కానీ వద్ద ఉన్న బాలుడు అక్కడున్న ప్లాస్టిక్ రూఫ్పైకి వెళ్లాడు. ఆ ప్లాస్టిక్ రూఫ్ పగలడంతో ఆ చిన్నారి ఐదో అంతస్తు నుంచి కిందపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన బాబును వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. దీంతో తన కుమారుడి మరణానికి ఫ్లాట్ యజమాని, సూపర్వైజర్ నిర్లక్ష్యం కారణమని బాలుడి తండ్రి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.