శంషాబాద్ : నకిలీ వీసాలు, ధ్రువ పత్రాలతో గల్ఫ్ వెళ్లేందుకు విఫలయత్నం చేసిన 44 మంది మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం…తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయత్నాలలో ఉన్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు డబ్బులు తీసుకొని నకిలీ వీసాలు, ధ్రువపత్రాలు సృష్టించారు. వీరిందరికి శంషాబాద్ ఎయిర్పోర్టులో టికెట్లు బుక్ చేశారు.
ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న మహిళల వీసాలు, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు అవన్నీ నకిలీవని తేల్చారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకొని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం సదరు మహిళలను పోలీసులు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.