దోమలగూడ :చిక్కడపల్లి ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు అక్కడ పేకాట ఆడుతున్న 10 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…. ఆదివారం రాత్రి చిక్కడపల్లి ప్రధాన మర్గంలో ఉన్న కల్లెపల్లి బ్రదర్స్ వీధిలో ఓ గదిలో పేకాట ఆడుతున్నట్లు మధ్యమండలం టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా సదరు ఇంటి పై ఆకస్మిక దాడులు చేసారు.
దీంతో ఓ గదిలో రహస్యంగా డబ్బులు పెట్టి నిషేధిత మూడు ముక్కలు ఆడుతున్న ఈటికాల రామ్చందర్ (64), నక్కల శ్రీధర్ రెడ్డి (42), వంగల పాండు (54), దాసమ్ రమేష్ (67), అజ్జుల శ్రీపాల్ రెడ్డి (45), ప్రమోద్ హాన్ (29), మైనమ్ శివ ప్రసాద్ (53), కాకర్ల రాజ్కుమార్ (41), జింకల్ కృష్ణ (56), పొగాకు సత్యనారాయణ (48)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచా 25, 350 రూపాయల నగదు, 11 సెల్ఫోన్లు, 52 పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట ఆడుతున్న 10 మందితో పాటు నిర్వాహకుడి పై 3,4 గేమింట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసారు. సోమవారం ఉదయం వీరందరికీ 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు జారీ చేసి సొంత పూచీ కత్తు పై విడుదల చేసినట్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సీఐ పాలడుగు శివశంకర్ వెల్లడించారు.