మన్సూరాబాద్ : ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో యువతులతో అసభ్యకర నృత్యాలు చేయించిన కేసులో నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆహ్వానితులకు మద్యం సరఫరా చేయడంతో పాటు డీజే సౌండ్లతో పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు సృష్టించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు.
సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థ ఐదవ వార్షికోత్సవ వేడుకలను ఎల్బీనగర్, నాగోల్, బండ్లగూడలోని పీఎంఆర్ గార్డెన్లో సోమవారం రాత్రి నిర్వహించారు. ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థ తన ఉద్యోగుల కోసం నిర్వహించిన ఈ వేడుకల్లో యువతులతో అసభ్యకర నృత్యాలు చేయించారు. అర్థరాత్రి వేళ డీజే సౌండ్లతో హోరెత్తించారు. కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులకు మందు సరఫరా చేశారు.
దీంతో తాగిన మైకంలో ఉన్న ఉద్యోగులు డీజేల హోరు సౌండ్లో యువతుల నృత్యాలకు అనుగుణంగా చిందులు వేస్తూ అరుపులు, కేకలు వేస్తూ అర్థరాత్రి వేళ హంగామా సృష్టించారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ విషయంపై ఎల్బీనగర్ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కార్యక్రమ నిర్వాహకుడైన పి. రవీంధర్ రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ వరదరాజన్, డీజే ఆపరేటర్ కడారి దిలీప్కుమార్ను అరెస్ట్ చేశారు. డీజే సెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.