భోపాల్: మరణించిన తల్లి అంత్యక్రియలకు సోదరుడు రాకపోవడంతో ఆగ్రహించిన సోదరి, అతడి కుమారుడు, మేనల్లుడైన పదేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. హనుమాన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీ క్యాంప్ ప్రాంతానికి చెందిన 40 ఏండ్ల అస్మా తల్లి శనివారం మరణించింది. అయితే ఝాన్సీలో ఉంటున్న ఆ మహిళ సోదరుడు తన భార్యతో కలిసి తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేదు.
మరోవైపు సోదరుడి పదేండ్ల కుమారుడు నానమ్మ వద్ద ఉంటున్నాడు. దీంతో తల్లి అంత్యక్రియలకు సోదరుడు రాకపోవడంపై అస్మా ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనల్లుడైన సోదరుడి కుమారుడిపై కత్తితో ఆమె దాడి చేసింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మేనల్లుడిపై కత్తతో దాడి చేసిన మేనత్తపై హత్యా యత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.