అమరావతి : విశాఖపట్టణంలోని రెల్లివీధిలో దారుణం జరిగింది. సొంత బిడ్డను ఓ తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రెల్లి వీధికి చెందిన వడ్డాది ప్రసాద్ అంబులెన్స్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు 16 ఏండ్ల కుమార్తె ఉంది. అయితే రెల్లి వీధికి చెందిన ఓ అబ్బాయితో ఆమె ప్రేమలో పడింది. అతనితో కొద్ది రోజుల క్రితం వెళ్లిపోయింది. పెద్ద కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుంది. రెండో కూతురు కూడా అదే బాటలో వెళ్లడంతో తండ్రి ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.
నిన్న ప్రసాద్ తల్లి చనిపోయిన రోజు కావడంతో.. రెండో కూతురిని ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన కూతురిని తానే చంపినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు ప్రసాద్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు.