లక్నో: విషం సేవించి అక్కాచెల్లెళ్లు మరణించారు. దీంతో పోలీస్ అధికారితోపాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రిన్స్ అనే వ్యక్తి తన కుమార్తె కోమల్ను తీసుకుపోయాడంటూ ఆమె తండ్రి కాంతి ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఛప్రౌలి ప్రాంతం బచోర్ గ్రామంలోని ప్రిన్స్ ఇంటిపై రైడ్ చేశారు. అయితే ఆ జంట అక్కడ కనిపించలేదు.
మరోవైపు పోలీసులు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ప్రిన్స్ తల్లి గీత, సోదరీమణులు స్వాతి, ప్రీతి విషం తాగారు. దీంతో వారిని మీరట్ జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారమే స్వాతి మరణించగా బుధవారం రాత్రి ప్రీతి కూడా చికిత్స పొందుతూ చనిపోయింది.
మరోవైపు అక్కాచెల్లెళ్ల మరణం వార్త తెలియడంతో బచోర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. కాగా, మరణించిన అక్కాచెల్లెళ్ల మృతదేహాలను అంబులెన్స్లో తీసుకురాగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. వారి డిమాండ్ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ పాల్తోపాటు కోమల్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.