తిరువనంతపురం : నిత్యం వేధిస్తున్న ఓ భర్తపై భార్య యాసిడ్ దాడి చేసి.. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. రేజిలాల్, బిందు అనే దంపతులకు కొన్నేండ్ల క్రితం వివాహం కాగా, వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. బిందును రేజిలాల్ వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేని భార్య.. ఆదివారం రాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తపై యాసిడ్ దాడి చేసింది. ఆ తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. ఐదేళ్ల కుమారుడితో ఇంటి నుంచి పారిపోయింది. సమీపంలో ఉన్న బావిలో కుమారుడిని తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్నది.
యాసిడ్ దాడి భరించలేని భర్త గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై అక్కడికి చేరుకుని, అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రేజిలాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మూడు రోజుల క్రితం బిందు, రేజిలాల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆ రోజు కూడా బిందు గట్టిగా ఏడ్వడంతో.. తామంతా వచ్చి సర్దిచెప్పామని పేర్కొన్నారు. అంతలోనే ఈ దారుణం జరిగిందని స్థానికులు అన్నారు.