మన్సూరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిరె భానుచందర్ను హత్య చేసిన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని.. అదేవిధంగా మృతుడి కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని కోరుతూ శుక్రవారం ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
రెండు నెలల క్రితమే పదిరె భానుచందర్కు రీటాకావ్యతో వివాహం జరిగిందని తెలిపారు. భానుచందర్ హత్యకు గురవ్వడంతో భార్య రీటాకావ్యతో పాటు ఆయన కుటుంబీకుల పరిస్థితి దయనీయంగా మారిందని మేడి పాపయ్య మాదిగ ఎమ్మెల్యేకు వివరించారు.
భానుచందర్ను హత్య చేసిన దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడటంతో పాటు ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీనిచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మృతుడు భానుచందర్ భార్య రీటా కావ్య, కుటుంబసభ్యులు సునీత, శశిధర్, రేణుక, గోపాల్, ఎమ్యార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్, నాయకులు ద్యావని నర్సింహా, ఆకారపు రుక్కమ్మ, జీడి నర్సింహా, మంద జయన్న, సంగపాక యేసూఫ్, శశి, నాగరాజు, మహంకాళి అశోక్, ఎస్. సంజన్న, బరిగల రామక్రిష్ణ, మంద నాగన్న తదితరులు పాల్గొన్నారు.