మొయినాబాద్ : స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుకాల నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి అతని పై నుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మొయినాబాద్ మండల కేంద్రం సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీతారామశాస్త్రీ(72) నగరంలోని తమ కుటుంబ సభ్యులతో బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని హైదర్షాకోట్లో నివాసం ఉంటాడు.
గతంలో మొయినాబాద్ మండలంలో కనకమామిడి, పెద్దమంగళారం గ్రామాల్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించాడు. కాగా సొంత గ్రామం అయిన కేతిరెడ్డిపల్లిలోని తన వ్యవసాయ పొలం వద్దకు ప్రతి రోజు హైదర్షాకోట్ నుంచి స్కూటీపై వచ్చి వెళ్తూ ఉండేవాడు. అదే మాదిరిగా శనివారం మధ్యాహ్నం పొలం వద్దకు స్కూటీపై వెళ్తుండగా మొయినాబాద్ సమీపంలోని కిరణ్ వే బ్రిడ్జ్ సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై వెనుకాల నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద అతను పడటంతో వాహనం అతనిపై నుంచి వెళ్లగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎస్ఐ జగదీశ్వర్, ఏఎస్ఐ శ్రీశైలం వారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.