నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండలం కేంద్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై బీర్ సీసాతో యువకుడు దాడి చేశాడు. దీంతో ఆమె గొంతుకు తీవ్ర గాయమైంది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సంజయ్ అనే యువకుడికి రెండేండ్ల క్రితం ఓ వివాహ వేడుకలో ప్రియాంక అనే యువతి పరిచయమైంది. సంజయ్కు ఆమె దూరపు బంధువు. అయితే తనను ప్రేమించాలని సంజయ్ ఆమె వెంట పడుతున్నాడు. ప్రియాంక అతని ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఒంటరిగా ఉన్న ప్రియాంకపై బీరు సీసాతో దాడి చేశాడు. ఆ సీసాతో గొంతుపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించారు. కేసు నమోదు చేసుకున్న మోపాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.