బెంగళూర్ : చికెన్ ఫ్రై రెడీ చేయమని కోరగా నిరాకరించిన భార్యను భర్త దారుణంగా కొట్టడంతో మరణించిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల తమ కూతురు షిరిన్ బానూ కనిపించడం లేదని ఆమె తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. అల్లుడు ముబారక్ పాషా (30)నే తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన తర్వాత పోలీసుల విచారణను దాటవేస్తున్న నిందితుడు సోమవారం నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి నేరాన్ని అంగీకరించాడు. ఈనెల 18న రాత్రికి చికెన్ ఫ్రై చేయాలని భార్యను కోరానని, తాను ఇంటికి వచ్చి చూడగా చికెన్ ఫ్రై సిద్ధంగా లేదని, భార్యను ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పిందని పాషా తెలిపాడు. ఆగ్రహంతో తాను అక్కడే ఉన్న కర్రతో ఆమె తలపై బలంగా కొట్టడంతో మరణించిందని చెప్పాడు. ఆపై ఆమె మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి బైక్పై తీసుకుని వెళ్లి చిక్కబనవర సరస్సులో పడేశానని చెప్పాడు. చికెన్ ఫ్రై కోసం భార్యను బలితీసుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.