రాజన్న సిరిసిల్ల : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే ఓ యువతిని 50 మంది యువకులు వచ్చి అపహరించిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని మంగళవారం తెల్లవారుజామున అపహరించారు. ఉదయం 5:20 గంటల సమయంలో ఓ నలుగురు యువకులు కారులో వచ్చారు. బలవంతంగా యువతిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, కారులో ఎక్కించారు. అడ్డుకోబోయిన తండ్రిని తోసేశారు. అనంతరం కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇవాళ ఉదయం కిడ్నాప్నకు గురైన యువతికి, అదే గ్రామానికి చెందిన కట్కూరి జాన్కు గత కొంతకాలం నుంచి పరిచయం ఉంది. అయితే ఏడాది క్రితం జాన్ ఆ యువతిని బయటకు తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మైనర్ కావడంతో.. పోలీసులు జాన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక రెండు రోజుల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. దీంతో జానే ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని మంగళవారం తెల్లవారుజామున అపహరించారు.. pic.twitter.com/boJszBaj4R
— Namasthe Telangana (@ntdailyonline) December 20, 2022