రాజన్న సిరిసిల్ల : వారిది ప్రేమ వివాహం.. ఆ అన్యోన్య దాంపత్యానికి పండంటి ఇద్దరు కుమారులు. ఆర్థిక ఇబ్బందులతో భర్త గల్ఫ్ వెళ్లడంతో.. భార్య తన ఇద్దరు కుమారులతో కలిసి స్వగ్రామంలోనే ఉంటోంది. అయితే అత్తమామలు ఆమెను వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన మహేందర్, అనూష ఐదేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతుండటంతో.. మహేందర్ గల్ఫ్ దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో 8 నెలల క్రితం మహేందర్ గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అప్పట్నుంచి అనూషను అత్తమామలు వేధిస్తున్నారు. మహేందర్, అనూష పెళ్లి చేసుకున్న నాటినుంచే ఆమె వేధింపులకు మొదలైనప్పటికీ, భర్త గల్ఫ్ వెళ్లినప్పటి నుంచి అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష తన ఇద్దరు పిల్లలను తీసుకొని గురువారం తెల్లవారుజామున గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.