Bihar | ఈ ఘటనను చూస్తుంటే ఏదో పరీక్షా కేంద్రం ఘటన గుర్తుకు వస్తుంది. చిటీలు రాసే అభ్యర్థులు స్క్వాడ్ రాగానే వాటిని నోట్లో వేసుకుని గబగబ మింగేస్తారు. ఆ మాదిరిగానే ఓ ఖైదీ కూడా మొబైల్ను మింగేశాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా జైల్లో శనివారం ఉదయం జైలు అధికారులు, పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఖైషర్ అలీ అనే ఖైదీ వద్ద మొబైల్ ఉంది. ఈ తనిఖీల్లో తాను దొరికిపోతామోనని అలీ భయపడ్డాడు. దీంతో ఆ మొబైల్ను బలవంతంగా మింగాడు.
ఇక ఆదివారం మధ్యాహ్నం సమయంలో అలీ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతన్ని జైలు అధికారులు.. గోపాల్గంజ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఖైదీకి స్కానింగ్ నిర్వహించగా, మొబైల్ ఫోన్ దర్శనమిచ్చింది. తనిఖీల సమయంలోనే ఖైదీ మొబైల్ ఫోన్ను మింగినట్లు అధికారులు ధృవీకరించారు.