లక్నో : ఓ పోలీసు దొంగగా మారాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్. ఓ కరెంట్ బల్బ్ను దొంగిలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ రాజేశ్ వర్మ ఫూల్పూర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే రాత్రి సమయంలో ఓ దుకాణం బయట ఉన్న కరెంట్ బల్బ్ను కానిస్టేబుల్ దొంగిలించాడు. ఆ తర్వాత బల్బ్ను తన జేబులో వేసుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
ఇక మరుసటి రోజు ఉదయం షాపు వద్దకు వచ్చిన యజమాని బల్బ్ లేకపోవడంతో షాక్కు గురయ్యాడు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, పోలీసే బల్బ్ను దొంగిలించినట్లు తేలింది. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, బల్బ్ను దొంగిలించిన కానిస్టేబుల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.